నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టును పవిత్ర వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఉత్సవ మూర్తులను శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర “పరిమళ” జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.తదుపరి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానాచారి కపిందర్, ఉప ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్, అభిలాష్, లక్ష్మణ్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితర అర్చకులు పాల్గొన్నారు.


