సేవా దృక్పథం ఉన్న నాయకులకు గుర్తింపు అవసరం: జువ్వాడి నర్సింగరావు
నవగీతం, మెట్పల్లి ప్రతినిధి:
సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తూ, ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారానికి ఎంపికైన మెట్పల్లి 3వ వార్డు కౌన్సిలర్, అడ్వకేట్, రాజ్యాంగ రక్షక దళ్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల నరేష్ ను సోమవారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఘనంగా సన్మానించారు. బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ-2026 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో నరేష్ ఈ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన సేవలను అభినందిస్తూ జువ్వాడి నర్సింగరావు ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలవడమే కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారంలో నరేష్ చూపుతున్న చొరవ అభినందనీయమని ఇలాంటి పురస్కారాలు సామాజిక కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని, నరేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బత్తుల నరేష్ మాట్లాడుతూ తనను అభినందించిన జువ్వాడి నర్సింగరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై బాధ్యతను మరింత పెంచిందని, నిరంతరం ప్రజాసేవలో ఉంటానని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బత్తుల నరేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

