నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “99 డేస్ యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు (ఈజీఎస్) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది మహిళల భద్రత, హక్కులు, సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత ప్రాముఖ్యత, “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం, ఆడపిల్లల విద్య అవసరం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలు, మొబైల్ అడిక్షన్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై వివరించారు. అలాగే మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, గృహ హింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక పోష్ చట్టంపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ నంబర్లైన 100 పోలీస్ హెల్ప్లైన్, 181 సఖి కేంద్రం, 1098 చైల్డ్ హెల్ప్లైన్, 1930 సైబర్ క్రైమ్, 14567 వయోవృద్ధుల హెల్ప్లైన్, 14416 డ్రగ్స్ అడిక్షన్ హెల్ప్లైన్ వివరాలను తెలియజేశారు. అదేవిధంగా మిషన్ వాత్సల్య పథకం, దత్తత విధానం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అందిస్తున్న పలు ఫైనాన్షియల్ స్కీమ్స్ గురించి వివరించారు. బీబీబీపీ, పోష్ చట్టం, పీసీపీఎన్డీటీ చట్టాలకు సంబంధించిన ఐఈసీ మెటీరియల్ను పంపిణీ చేశారు.మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం సాధికారత లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని మహిళా సాధికారత కేంద్రం బృంద సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈజీఎస్ వర్కర్లు, మహిళా సాధికారత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

