నిందితులపై కఠిన చర్యలకు బొంకూరి కైలాసం డిమాండ్
నవగీతం,పెద్దపల్లి:
పెద్దపల్లి పట్టణంలోని 24, 25వ వార్డుల పరిధిలో నిర్మించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కమ్యూనిటీ భవన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఘటన వెనుక చెగువీర యూత్ అనే గుంపు ప్రమేయం ఉందని అంబేడ్కర్ కమ్యూనిటీ భవనం అధ్యక్షులు బొంకూరి కైలాసం ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన ఎస్సీ కమ్యూనిటీ స్థలంలో,2020లో అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 19.50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా,2022 డిసెంబర్ 19న అధికారికంగా భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్లు కైలాసం పేర్కోన్నారు.అయితే ఎన్నికల కోడ్ కారణంగా భవన నిర్మాణం తాత్కాలికంగా నిలిచిపోయింది.ఈ క్రమంలోనే చెగువీర యూత్ పేరుతో కొంతమంది యువకులు అక్కడ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారని,దీనిని ప్రశ్నించినందుకు కక్ష గట్టి అంబేడ్కర్ ఫ్లెక్సీలను తొలగించి,చివరకు శిలాఫలకాన్ని పగలగొట్టారని కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు.గత ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ,తాజాగా జనవరి 26 వేడుకలను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటనకు బాధ్యులుగా చంద్రగిరి ఉదయ్,ఆరేపల్లి మానస్,ఆరేపల్లి మనోజ్,ఆరేపల్లి మల్లి అనే వారిని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కైలాసం వెల్లండించారు. నిందితులపై నాన్బైలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన స్థలంలో అక్రమాలను సహించబోమని ఆయన హెచ్చరించారు.

