ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు
నవగీతం,పెద్దపల్లి
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందుబాబులకు పెద్దపల్లి కోర్టు వినూత్న శిక్ష విధించింది.పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన తీగల అజయ్-కాచాపూర్,పర్శ తిరుపతి-చందపల్లి,మెరుగు సతీష్- చిన్నకల్వల,తలారి రాహుల్ ఖిలవనపర్తి లను పోలీసులు పెద్దపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.కేసును విచారించిన న్యాయమూర్తి మంజుల నిందితులకు రూ.500 జరిమానాతో పాటు రెండు రోజుల పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.కోర్టు తీర్పు మేరకు,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పర్యవేక్షణలో నిందితులు గురువారం పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన కమాన్ మరియు బస్టాండ్ సెంటర్లలో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించారు.మద్యం తాగి వాహనాలు నడిపితే ఎదురయ్యే ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ విధుల్లో పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి ఇలాంటి సామాజిక శిక్షలు విధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

