భారత తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం: ప్రధాని మోదీ
నవగీతం,న్యూఢిల్లీ:
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఒప్పందాలకు తల్లి గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం (జనవరి 26) భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోని రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి ఇది గొప్ప ఉదాహరణ. ఈ ఒప్పందం రెండు పక్షాలకు విస్తృత అవకాశాలను తెస్తుంది అని ప్రధాని మోదీ అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారత తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం , ఎగుమతుల పెరుగుదల, ఉపాధి అవకాశాల విస్తరణ చోటుచేసుకుంటాయని ఆయన వివరించారు.గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక అతిథులుగా భారతదేశాన్ని సందర్శించిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనీయో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ ఒప్పందం భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

