టి జి యు ఎస్ జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు డిమాండ్
నవగీతం,కోరుట్ల:
రిటైర్మెంట్ పొందుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, డీఏ, పీఆర్సీ, అలాగే రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని టీ జీ యు ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కోరుట్ల మండలంలో జడ్ పి హెచ్ ఎస్ ఏకిన్ పూర్ పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుడు జుంబర్తి శంకర్ పదవీవిరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏళ్ల తరబడి విద్యారంగానికి సేవలందించిన ఉపాధ్యాయులు పదవీవిరమణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడం దురదృష్టకరమన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ అమలు, ఇతర రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చెల్లించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు మార్గం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సేవలు సమాజానికి అమూల్యమైనవని, రిటైర్మెంట్ అనంతరం కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పదవీవిరమణ పొందుతున్న జుంబర్తి శంకర్ తన సేవా ప్రయాణాన్ని స్మరించుకుంటూ, సహచరుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల విద్యాధికారులు నరేశం, శ్రీనివాస్, లక్ష్మి నారాయణలు, సోదర ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి రాజేష్,రాష్ట్ర నాయకులు బోనగిరి దేవయ్య, సిరిపురం రాజేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

