హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో శ్రీనివాసుడు
నవగీతం, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ వేంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు బుధవారం ఉదయం ఐదు పడగల బంగారు సర్ప వాహనం, చిన్న శేష వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు దేవత వేణుగోపాల కృష్ణుడిగా అలంకరించబడి, సర్పాన్ని స్వారీ చేస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇది విశ్వ శక్తి, ఆధ్యాత్మిక మేల్కొలుపు, అడ్డంకులను తొలగిస్తుందని, భక్తులను సర్ప దోషాలనుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. పెద్ద శేష వాహనం ఆదిశేషుని సూచిస్తే , చిన్న శేష వాహనం వాసుకిని సూచిస్తుంది. ఊరేగింపు సమయంలో, ఆలయ మాడ వీధుల వెంట భక్తులను స్వామి ఆశీర్వదించారు.

అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై రాత్రి 7 గంటల నుండి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హంస వాహనసేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.ఈ వాహనసేవలో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ ఏవి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

