జిల్లా విద్యశాఖాధికారి రాము
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు కె. సుగుణాకర్ కు డీఈవో చేతుల మీదుగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీతను ప్రదానం చేశారు. అలాగే సుగుణాకర్ చేస్తున్న సేవలను, జాతీయభావనను కొనియాడుతూ డిఈవో, ఆర్యుపిపి జిల్లా శాఖ అధ్యక్షులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక అంశంపై ఒక పేజీకి మించకుండా తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో కథలు రాసి పంపాలని సూచించారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతి–నిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే కథా రచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో వారు మంచి రచయితలుగా ఎదగగలరని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు కథలను తప్పనిసరిగా పంపాలని సూచించారు. అందిన కథలను పరిశీలించి ఉత్తమ కథలను ఎంపిక చేసి మార్చి మొదటి వారంలో పుస్తకరూపంలో వెలువరించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బాలసాహిత్య సృజనకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కథలను మార్చి 15వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. వివరాలకు 8985348424 నంబర్కు లేదా ఎఎమ్ఓ ఎం.చంద్రశేఖర్ రెడ్డిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్యుపిపి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎనగందుల రాజేంద్రప్రసాద్, గౌరవ అధ్యక్షులు అలకట్టు సత్యనారాయణ, వేల్పుల రఘు తదితరులు పాల్గొన్నారు.

