నవగీతం, మెట్ పల్లి :
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న పన్నుల వసూళ్ల ప్రక్రియపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను మరియు ఇతర పన్నుల వసూళ్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమయానికి అందేలా పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎక్కువ కాలంగా బకాయిలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వసూళ్లు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో పన్నుల వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులు చెల్లించేలా ప్రోత్సహించాలని తెలిపారు. మున్సిపల్ సేవలను మెరుగుపరచడంలో పన్నుల వసూళ్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

