ప్రతి ఇంటికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు మంత్రి అడ్లూరి
నవగీతం, జగిత్యాల/ పెగడపల్లి:
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో గురువారం సాయిల సూరమ్మ- ముని లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడంలేదని సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోని డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏప్రిల్ మాసంలో మరి కొంత మంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల అందజేస్తామని మంత్రి తెలిపారు.

అంతకు ముందు నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండప నిర్మాణం తో పాటు వంటశాల నిర్మాణానికి నెల రోజుల్లో నిధులు మంజూరుకి తన వంతుగా సహకరిస్తానని మంత్రి తెలిపారు. పురాతన ఆలయానికి భక్తులు రావడానికి నంచర్లకు కావలసిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.


