నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద ఏప్రిల్ 1 నుండి 3 వరకు నిర్వహించనున్న చిన్న హనుమాన్ జయంతి మహోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాలు, మాలవిరమణ ప్రాంతాలు, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలు జరిగే మార్గాల్లో విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా సిబ్బందిని నియమించాలని, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


