నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి రాజం విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన రచించిన “తిరుగు ప్రయాణం” కథల సంపుటి విశేష ఆదరణ పొందడంతో పాటు విశాల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది.అలాగే “జీబీ రాజ్ జిందాబాద్” నాటక ప్రదర్శన ద్వారా మద్యపాన వ్యతిరేక చైతన్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారు.“నీ బాకీ తప్పక తీరుస్తాను…” అంటూ సామాజిక వ్యంగ్యంతో కూడిన ఆయన పాట ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందింది.జగిత్యాల సమీపంలోని తక్కల్లపల్లి గ్రామంలో జన్మించిన లక్ష్మి రాజం విప్లవ భావజాలానికి సానుభూతి కలిగి జీవించారు. జీవన పరిస్థితుల కారణంగా పోలీస్ శాఖలో చేరి, కరీంనగర్ జిల్లాలో పోలీస్ విభాగం తరఫున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మార్చ్ 25, 2026న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.1992 నుంచి తనకు పరిచయమై, కుటుంబ సభ్యుడిలా మారిన లక్ష్మి రాజం మరణం పట్ల బి.ఎస్. రాములు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.జగిత్యాల సాహితీ మిత్రులు కూడా ఆయన అకాల మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

