ఎరువుల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలి
ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్
పెద్దూర్ పీఏసీఎస్, సిరిసిల్లలోని ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్ లో తనిఖీలు
నవగీతం,రాజన్నసిరిసిల్ల
ఎరువులు కొనుగోలు చేస్తున్న రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్, పెద్దూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో బుధవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయా షాపుల్లో ప్రస్తుతం రిజిస్టర్, స్టాక్ ఎరువుల నిలువలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ఎరువులు విక్రయించారో ఆరా తీశారు. ఇప్పటిదాకా విక్రయించిన ఎరువుల, రైతుల పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెర్టిలైజర్ షాప్ లు ఉదయమే తెరవాలని, సాగుకు అనుగుణంగా ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.

