నవగీతం,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, గౌరాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు కాసాని శేఖర్ యాసంగి వరిని ముందస్తుగా సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆయన అక్టోబర్ 16న “జె జి ఎల్ 24423” అనే చలికి తట్టుకునే వరి వంగడాన్ని నారు పోసి, నవంబర్ 18న ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాట్లు వేశారు.సాధారణంగా తెలంగాణలో యాసంగి వరిని డిసెంబర్ మొదటి వారంలో నారు పోసి, జనవరి మొదటి వారంలో నాట్లు వేయడం రైతులు అనుసరిస్తున్న విధానం. అయితే, దీనికి భిన్నంగా ముందస్తు సాగు చేపట్టిన శేఖర్ ప్రస్తుతం 105 రోజుల దశలో ఉన్న వరి పంట బిర్రు పొట్ట దశలో మంచి స్థితిలో ఉందని తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా. బి. హరికృష్ణ, పూదుర్లోని రావెప్ విద్యార్థినీలతో కలిసి శేఖర్ పొలాన్ని సందర్శించారు. పరిశీలనలో వరి పంటలో కొంతమేర అగ్గి తెగులు లక్షణాలు కనిపించడంతో, దాని నివారణకు అవసరమైన మందుల వివరాలను రైతుకు సూచిస్తూ రాతపూర్వకంగా అందజేశారు. ముందస్తు సాగు, నిపుణుల సూచనలతో రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చని ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు

