జిల్లా అధ్యక్షుడు రాజనర్సయ్య
నవగీతం,పెద్దపల్లి:
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రాజనర్సయ్య వెల్లడించారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజనర్సయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని,పెద్దపల్లి,సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లోని అన్ని కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచించాయని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ బీసీలను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు.ఈ అగ్రకుల పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు,కార్యకర్తలకు ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని రాజనర్సయ్య పేర్కొన్నారు.సామాజిక న్యాయం బీఎస్పీతోనే సాధ్యమని, ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ పేగ నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గోపాల్ యాదవ్,రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ జింక ఉదయ్,పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు బోంకురి దుర్గయ్య,ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్,పట్టణ అధ్యక్షురాలు రామిళ్ల శారద,సీనియర్ నాయకురాలు కడావేర్ల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

