నవగీతం,కరీంనగర్
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ డివిజన్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త గాలిపెల్లి కుమార్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 2026 జాతీయ అవార్డును అందుకున్నారు.ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.ఇప్పటివరకు 54 సార్లు రక్తదానం చేసిన గాలిపెల్లి కుమార్, ఒక్క 2025 సంవత్సరంలోనే 4 సార్లు రక్తదానం చేయడం విశేషం.కేవలం తను రక్తదానం చేయడమే కాకుండా,రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు.ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ యువతలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు మరిన్ని శిబిరాలు నిర్వహిస్తానని,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్,పరుశ వెంకటరమణ,గంప ప్రసాద్ తదితరులు పాల్గొని కుమార్ను అభినందించారు.

