నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల మండల స్థాయిలో స్పోర్ట్స్ స్కూల్ అభ్యర్థుల ఎంపికలను ఈనెల 17 మంగళవారం నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అయిత శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిజికల్ డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హకీంపేట, హన్మకొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతి ప్రవేశాల కోసం మొత్తం 100 సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. టీజీ ఎస్ ఎస్ తెలంగాణ .జి ఓ వి .ఇన్ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మండల స్థాయి బ్యాటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ పరీక్షలు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కొడిమ్యాల ఆవరణలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఫిజికల్ డైరెక్టర్లు నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో పరీక్షకు 30 నిమిషాల ముందు హాజరు కావాలని సూచించారు.మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఈనెల 31న నిర్వహించే జిల్లా స్థాయి ఎంపికలకు పంపిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు.మరిన్ని వివరాలకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కొడిమ్యాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్యను 9441431287 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.ఈ సమావేశంలో ఫిజికల్ డైరెక్టర్లు లక్ష్మీ రాంనాయక్, బూట్ల రాజామల్లయ్య, భీరయ్య తదితరులు పాల్గొన్నారు

