జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ నరేష్కు వినతి పత్రం
నవగీతం, కొడిమ్యాల
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు లంచ్ అవర్ సమయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నిరసన అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ నరేష్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను ఉంచారు. జూన్ 2, 2026 నాటికి పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను రెండు విడతలలో చెల్లించాలని కోరారు.అలాగే 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మే 1, 2026 నుండి హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కన్వీనర్ ముల్క శ్రీనివాస్, చైర్మన్ తరిగొప్పుల నరేష్, టీ జి పిఈ టీ ఏ. జిల్లా అధ్యక్షులు జేఏసీ.నాయకులు బూట్ల రాజామల్లయ్య, గాలేటి తిరుపతి రెడ్డి, వంగ సంపత్ కుమార్,తైదల అంజయ్య, కల్లెడ అశోక్, మల్లారపు రాజయ్య నాంపల్లి రాజేశం. ఉపాధ్యాయురాలు పద్మా విమల రజిత మోహనమ్మ అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.


