భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈ నెల 10 నుండి 13 వరకు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జయంతి వేడుకల సందర్భంగా వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, మాలవిరమణ ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలు, వాహనాల రాకపోకలు జరిగే మార్గాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు.అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఎలాంటి నేరాలకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి,ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సీఐలు రవి, సుధకర్,కరుణాకర్, ఎస్. ఐ నరేష్ పాల్గొన్నారు.


