సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
జగిత్యాల, సెప్టెంబర్11,(నవగీతం):జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు.అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ..ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.

అధికారులు, సిబ్బంది అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రజలకు భద్రతాభావం కల్పించడంలో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని కావున సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల తరచుగా సందర్శిస్తూ పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు.ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.అలాగే రాబోవు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, ఊరేగింపు మార్గాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఎస్పి వెంట ఎస్.ఐ గీత మరియు సిబ్బంది ఉన్నారు.

