పక్కా భవనం లేక తీవ్ర ఇబ్బందులు
మొట్లగూడెం గ్రామంలో విద్యార్థుల దుస్థితి.
నుగురు వెంకటాపురం,సెప్టెంబర్ 11,(నవగీతం):ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని రాచపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మొట్లగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది.విద్యార్థులకు చదువుకునేందుకు పక్కా పాఠశాల భవనం లేక తాత్కాలికంగా తాటకుల గుడిసెలో తరగతి గదులు నిర్వహిస్తున్న సంఘటన ఆదివాసీ గ్రామీణ విద్యార్థులపై ప్రభుత్వాల ప్రేమ ఏమిటో చెప్పకనే చెబుతుంది.అసలేవర్షాకాలం కావడం తో గుడిసెలో తరగతులు నిర్వహించాలంటే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు మండల విద్యాధికారికి,తహసీల్దార్ కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు పాఠశాలలో సరైన వసతులు లేక,తాటాకుల గుడిసెలో ఎండకు ఎండివానకు తడిసి చదువును కొనసాగిస్తుంటే, కనీసం సంబంధిత అధికారులు పట్టించు కోవడంలేదని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

