టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి
నవగీతం,పెద్దపల్లి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ అడక్ కమిటీ మెంబర్,జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి పాల్గొని,అంబటి రాంబాబు తీరును ఎండగట్టారు.ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు,ప్రతివిమర్శలు సహజమని,కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు వాడిన భాష అత్యంత హేయమైనదని మండిపడ్డారు.ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిదని, ఆయన పదజాలం అసభ్యతతో,సంస్కారహీనంగా ఉందని ధ్వజమెత్తారు.ఇటువంటి వ్యాఖ్యలు తెలుగు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి ఉదంతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకంలో భాగంగానే అంబటి రాంబాబు ఈ స్థాయిలో రెచ్చిపోయారని విమర్శించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా,ప్రజల మధ్య విద్వేషాలను ప్రేరేపించేలా మాట్లాడటం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు.వ్యవస్థలను అగౌరవపరుస్తూ,ముఖ్యమంత్రిపై బూతులతో విరుచుకుపడిన అంబటి రాంబాబుపై ప్రభుత్వం,న్యాయస్థానం సుమోటోగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాజంలో ఇటువంటి ధోరణులను అరికట్టకపోతే భవిష్యత్తులో రాజకీయ విలువలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కోల కిషన్ రావు,పెర్క శ్రీనివాస్ తదితరులు పాల్గొని అంబటి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు.

