మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లికి ఐటీ పార్క్,బస్సు డిపోఅభివృద్ధిలో తగ్గేదే లేదన్న ఎమ్మెల్యే విజయరమణారావు
నవగీతం, పెద్దపల్లి:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, యువతకు సరైన ఉపాధి కల్పించకుండా కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను వంచించిన ఆ పార్టీకి,ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘాటుగా విమర్శించారు .బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ,తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వ్యవస్థను మళ్లీ దారిలోకి తెచ్చి, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ పాలనను చేతల్లో చూపిస్తున్నామని,రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతోందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క పేదవాడికి కూడా ఇళ్లు ఇవ్వలేదని,కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపల్లి సహా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని,ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.నిరుద్యోగ యువత కోసం గ్రూప్ 1, 2, 3 పరీక్షల నిర్వహణతో పాటు ఐటీఐలో ఏటీసీని ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. అలాగే,ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటు చేస్తున్నామని, పెద్దపల్లి మరియు మంథని పట్టణాలకు బైపాస్ రోడ్లను మంజూరు చేశామని వివరించారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వంటి సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో అమలు చేస్తున్నామని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలను విస్మరించిందని, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరకొరగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తమ ఎమ్మెల్యే విజయరమణారావు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించారని గుర్తు చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని,పారదర్శకమైన పాలనను ప్రజల ముంగిటకు చేరుస్తామని మంత్రి హమీ ఇచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, నారకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

