ఆటో దిగిన క్షణాల్లోనే విషాదం
నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలంలోని నడికుడ గ్రామ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు–గౌతమి దంపతుల కుమారుడు వేదన్ష్ (4) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే…నాగరాజు దంపతులు తమ కుమారుడితో కలిసి వాల్గొండ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా నడికుడ వద్ద ఆటో నుంచి దిగిన అనంతరం రోడ్డును దాటే క్రమంలో రాఘవపేట నుండి మొగిలిపేట వైపు అతివేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం బాలున్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి వేదాంత్ తీవ్రంగా గాయపడగా, వెంటనే నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులు ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

