నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రతినెల జరిగే మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి పత్రిక విలేఖరులను ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని 50 వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహేష్ శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే మున్సిపల్ సాధారణ సమావేశాలకు కూడా పత్రికా విలేఖరులను ఆహ్వానిస్తే, సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండి, సమిష్టి నిర్ణయాలు పట్టణ ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుందన్నారు. వివిధ వార్డులలో జరిగే, జరుగబోయే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని, గతంలో కూడా మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆనవాయితి ఉందన్నారు. ఆ సమయంలో ప్రజలకు మున్సిపల్ ఎజెండా అంశాలు, నిర్ణయాలు, అభివృద్ధి గురించి ప్రజలందరికి ఒక అవగాహన కలిగి, తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళకుండా నిరోధించగలిగిందన్నారు. స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగి అన్ని నిర్ణయాధికారాలు తీసుకునే అవకాశం ఉన్నందున పత్రిక విలేఖరులను ఆహ్వానిస్తే బాగుంటదని తన వ్యక్తిగత అభిప్రాయమని ఆ దిశగా ప్రజాప్రతినిధులందరి అభిప్రాయం సేకరణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని లావణ్య కోరారు.

