కోరుట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,కలెక్టర్ బి.సత్యప్రసాద్
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో, మార్క్ఫెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తమ ఉత్పత్తులను విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతిగానే ఉంటుందని, రైతు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల గంగాధర్ వసంత, మార్కెట్ కమిటీ బాధ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


