పునరుద్ధరణ పనులకు శ్రీకారం
నవగీతం ,కోరుట్ల ప్రతినిధి:
గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా గత 20 సంవత్సరాలుగా నిరాదరణకు గురై, కనీసం శుభ్రం చేయడానికి కూడా వీలులేకుండా ఉన్న మంచినీటి ట్యాంకుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గురువారం నాడు కథలాపూర్ సర్పంచ్ న్యావనంది శేఖర్, ఉప సర్పంచ్ చాట్పల్లె ప్రసాద్ మరియు కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ ట్యాంకు పునరుద్ధరణ పనులను ఘనంగా ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, ట్యాంకును సమూలంగా శుభ్రం చేయడంతో పాటు, భవిష్యత్తులో నిర్వహణ సులభతరం చేసేందుకు నూతన మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 11, 12 వార్డుల మెంబర్లు బాపురపు దేవేందర్, బాపురపు శ్రీకాంత్ పాల్గొని, గ్రామస్తుల ఆరోగ్యమే పరమావధిగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టిన ఈ అభివృద్ధి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

