మల్లాపూర్, నవగీతం ప్రతినిధి:
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ బిట్ల సరోజన విజ్ఞప్తి చేశారు.ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “మన ఊరు – మన బడి” కార్యక్రమంలో భాగంగా వేంపల్లి ప్రాథమిక పాఠశాలకు రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరు లభించిందని తెలిపారు. పనులు ప్రారంభమై దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయని, అయితే ఇప్పటివరకు చేసిన పనులకు పూర్తి స్థాయిలో బిల్లులు విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయని వివరించారు.


