మృతుడు తిరుమని రమణగా గుర్తింపు
నవగీతం,కొడిమ్యాల
జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ సమీపంలోని వరద కాలువలో లభించిన కారులో డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని పోలీసులు పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తిరుమని రమణగా గుర్తించారు.నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రమణ కోసం కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కిరణ్కు మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీఐ నీలం రవి, కాల్ డేటా మరియు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో రమణ చివరిసారిగా మల్యాల ప్రాంతంలోనే కనిపించినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు మల్యాల ఎక్స్ రోడ్ సమీపంలోని కాలువలో కారును గుర్తించి వెంటనే వెలికితీశారు. పరిశీలనలో కారులోనే తిరుమని రమణ ఉన్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు దారితీసిన కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ నీలం రవి తెలిపారు.

