నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము మరియు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

