నవగీతం, జగిత్యాల:
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, వినతులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఆర్డీఓలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, అధికారులు శాఖల వారీగా అందిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి సమగ్రంగా విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 57 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

