నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ అశోక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లోని పలు ఈద్గా మైదానాలను ఎస్పీ స్వయంగా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…“బక్రీద్ పర్వదినాన్ని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లాలో అన్ని ఈద్గా ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి సామరస్య వాతావరణాన్ని కాపాడాలి” అని అన్నారు.పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు.


