నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని సాయిరాం నగర్-1 అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా’ అవగాహన కార్యక్రమం మరియు చిన్నారుల ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు 0-6 సంవత్సరాల పిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ, జంక్ ఫుడ్ విడనాడి ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలని అధికారులు సూచించారు. 3-6 ఏళ్ల పిల్లలను అంగన్వాడీలకు పంపడం వల్ల కలిగే ప్రయోజనాలను, వారి అభివృద్ధి మైలురాళ్లను తల్లిదండ్రులకు వివరించడమే కాకుండా, ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొంటూ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎ. భారతి, అంగన్వాడీ టీచర్లు టి. శోభారాణి, సిహెచ్. మాధవి, బి. శంకరమ్మ మరియు ఆయామ్మ విజయ తదితరులు పాల్గొన్నారు.


