నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
ఎండలు ముదురుతుండటంతో కోరుట్ల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ తాటి ముంజల విక్రయాలతో సందడిగా మారాయి. వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారంగా పేరున్న తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాకుండా, సహజ సిద్ధమైన కూలెంట్గా పనిచేసి శరీర వేడిని తగ్గిస్తాయి. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి బరువు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముంజలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా, ఎండ తీవ్రత వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తాయి. లేత ముంజలను పైన ఉండే పొట్టుతో సహా పరిమితంగా తీసుకోవడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలే మేలని స్థానికులు పేర్కొంటున్నారు.

