నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు పరాకాష్టకు చేరుకున్నాయి. పట్టణంలో రద్దీగా ఉండే గాంధీ రోడ్ మధ్యాహ్నం సమయానికి నిర్మానుష్యంగా మారింది.సాధారణంగా వాహనాల రాకపోకలు, ప్రజల కోలాహలంతో కిక్కిరిసిపోయే ఈ ప్రధాన రహదారి, నేడు మధ్యాహ్నం 1:55 గంటల సమయంలో జన సంచారం లేక వెలవెలబోయింది. ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో, గాంధీ రోడ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. అడపా దడపా తిరుగుతున్న వాహనదారులు కూడా ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. వ్యాపార సముదాయాలు ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు లేక వ్యాపారాలు మందగించాయి. ఎండల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.వేసవి తీవ్రత ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మధ్యాహ్నం పూట జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే అవకాశం కనిపిస్తోంది.

