నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రముఖ బుల్లితెర నటి, మాటీవీ ‘సప్తపది’ సీరియల్ ఫేమ్ నీలిమ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమావాస్య సందర్భంగా కొండగట్టు అంజన్న సన్నిధికి విచ్చేసిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.అనంతరం ఆలయ విశిష్టతలను వివరిస్తూ కొండగట్టు క్షేత్రంలో నారసింహస్వామి ముఖం. ఆంజనేయస్వామి ముఖం కలిగిన ద్విముఖ స్వరూపంతో స్వామివారు వెలసి ఉండటం ఎంతో అరుదైన విశేషమని తెలిపారు. నరసింహ స్వరూపం సాక్షాత్తు మహావిష్ణువు అవతారమని పేర్కొన్న ఆమె, కొండగట్టు ఆంజనేయస్వామివారు నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో సీతారాములతో దర్శనమివ్వడం ఈ క్షేత్ర మహిమాన్వితతకు నిదర్శనమని అన్నారు.అదేవిధంగా క్షేత్రపాలకునిగా బేతాళ స్వామి విరాజిల్లడం కూడా ఈ దేవస్థానం ప్రత్యేకత అని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నీలిమకు వేదోక్త ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

