కల్లేడ నరేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం
రాజకీయ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి
నవగీతం, హైదరాబాద్:
సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ, రాత్రింబవళ్లు శ్రమిస్తున్న జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TDWJF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ రాజకీయ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, జర్నలిస్టుల పట్ల రాజకీయ నాయకులు తమ వైఖరిని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మరియు సమాజంలో జర్నలిస్టులు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉంటారనే నిజాన్ని ఎవరూ మరువరాదని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియా గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేస్తూ, “ఒక్క జర్నలిస్ట్ను తొక్కితే 100 మంది పుట్టుకొస్తారు” అని ఆయన భీష్మించారు. జర్నలిస్టుల ఐక్యతను, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.”జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి, నిజాలను దాచాలనుకోవడం మూర్ఖత్వం. జర్నలిస్టులను ఇబ్బంది పెడితే ప్రభుత్వాలను గద్దె దించే శక్తి కూడా మీడియాకు ఉంది.” అని అయన ఈ సందర్బంగా తెలిపారు. ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులపై దాడులకు తెగబడుతున్న రాజకీయ నాయకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కల్లేడ నరేష్ కుమార్ స్పష్టం చేశారు.


