గోడపత్రిక ఆవిష్కరణ
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎస్. అంజనారెడ్డి తెలిపారు.ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయని చెప్పారు. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజల్ సేవలు ఘనంగా జరగనున్నట్లు వివరించారు. దీక్షామండపంలో హనుమాన్ దీక్ష స్వాముల విరమణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం మాట్లాడుతూ, కొండగట్టు అంజన్న ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 295 నుండి రూ. 495కు పెంచినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెంపుతో వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు. అలాగే మరిన్ని ఐదు పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఆదిరెడ్డి, సిఐ నీలం రవి, అర్చకులు స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చక రామకృష్ణ, ఉప ప్రధాన అర్చక చిరంజీవి, ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


