రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ గ్రామసభల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమై ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రోడ్డు ప్రమాదాల నివారణ , సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్రావుపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా ప్రచారం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు.అదేవిధంగా యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొంటూ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.


