నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాడ మాసం బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.కార్యక్రమం విజయవంతం కావడానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేపట్టగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ మహోత్సవంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ,ఉప సర్పంచ్ గడ్డం సోమా రెడ్డి,వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.


