పోయిన బంగారాన్ని యజమానికి అప్పగించిన వ్యాపారి
నవగీతం, మల్లాపూర్:నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఓ కిరాణా వ్యాపారిని స్థానికులు ఘనంగా సన్మానించారు. మల్లాపూర్ మండలంలోని వెంపల్లి గ్రామానికి చెందిన తోట పెద్దరాజరెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని సంతోష్ కిరాణా దుకాణానికి వెళ్లిన సందర్భంగా తన వద్ద ఉన్న 10 గ్రాముల బంగారాన్ని అనుకోకుండా పోగొట్టుకున్నారు. దుకాణంలో బంగారం కనిపించడంతో దుకాణ యజమాని సంతోష్ నిజాయితీతో వ్యవహరించి, దానిని భద్రపరచి యజమాని తోట పెద్దరాజరెడ్డికి తిరిగి అందజేశారు. సంతోష్ చూపిన నిజాయితీని అభినందిస్తూ మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సంతోష్ చేసిన నిజాయితీ నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అప్రైజర్ ఉపాధ్యక్షులు తిప్పర్తి రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

