నవగీతం, కోరుట్ల
కథలాపూర్ మండలం సీరికొండ గ్రామంలో బుధవారం రోజున శ్రీ మహాదేవ స్వామి శివాలయం లో శివపార్వతుల కల్యాణం వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో పార్వతీ, పరమేశ్వరులను వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించారు. శివపార్వతుల కల్యాణ వస్త్రాలను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలతో గ్రామ వీధుల్లో ఊరేగించిన అర్చకులు ఆలయంలో అధిష్ఠింపజేశారు. సకల విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో అర్చకులు కల్యాణతంతు ప్రారంభించారు. నూతన వధూవరులు శివ పార్వతులకు కల్యాణ వస్త్రాలు అందజేశారు. పరమేశ్వరుడికి యజ్ఞోపవీతధారణ పర్వాలు జరిపిన అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదానతంతు నిర్వహించారు. నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. స్వామి, అమ్మవార్ల శిరస్సులపై ముత్యాల తలంబ్రాలను అర్చకులు,గ్రామ పెద్దలు వేదోక్త పఠనాల నడుమ అలంకరింపజేసే ఆధ్యాత్మిక ఘట్టాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ వైభవంగా కొనసాగాయి. అనంతరం నిర్వాహకులు ప్రతి ఒక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముదాం రవి,ఉప సర్పంచ్ చిట్ కూరి మల్లయ్య, సోమ సూత్రం విశ్వనాథం, అల్లే రాందాస్, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

