నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు సీరియస్గా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను వినాలని, ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

