నాలుగో రోజూ సీసీ కెమెరాకు చిక్కిన వైనం!
నవగీతం,కొడిమ్యాల
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల మండలం సూరంపేట గంగారాం తండా గ్రామస్థులను పులి భయం వెంటాడుతోంది.గత నాలుగు రోజులుగా గంగారాం తండా పరిసరాల్లోనే తిష్టవేసిన పులి, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.తాజాగా మంగళవారం రాత్రి కూడా పులి సంచరించినట్లు అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.వరుస దాడులతో వణుకుతున్న తండాగత మూడు రోజుల్లో పులి రెండు ఆవులను వేటాడి చంపి తిన్న సంగతి తెలిసిందే. పులి ఇంకా అదే ప్రాంతంలో సంచరిస్తుండటంతో గంగారాం తండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు.పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయాన్నే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి దాడిలో మరణించిన పశువుల కళేబరాల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టారు. పులిని తిరిగి అడవిలోకి పంపేందుకు లేదా బంధించేందుకు అవసరమైన చర్యలపై అధికారులు నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రతను దృష్ట్యా అధికారులు గ్రామస్థులకు పలు సూచనలు జారీ చేశారు.గ్రామంలో టం టంవేయించారు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా వెళ్లొద్దు. రైతులు పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తే కనీసం 5 నుండి 10 మంది బృందాలుగా వెళ్లాలి. శబ్దాలు చేయాలి పొలాల్లో పని చేస్తున్నప్పుడు రేడియోలు పెట్టుకోవడం లేదా అప్పుడప్పుడు కేకలు వేస్తూ పులిని అప్రమత్తం చేయాలి.రాత్రి వేళల్లో పొలాల వద్ద కాపలా ఉండటం ప్రమాదకరమని, పశువులను సురక్షితమైన పాకల్లో ఉంచాలని సూచించారు.పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖాధికారులకు తెలపాలని కోరారు.


