నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం పూర్తి చేసుకోనున్న తోటివిద్యార్ధినులులకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్ధినులు ఘనంగా వీడ్కోలు పలికారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. గునుక శ్రీలత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…ఈ రోజు ఈ సమావేశాన్ని చూస్తుంటే ఈ గడిచిన రోజులు మళ్ళీ రావని, ఈ డిగ్రీ కోర్సు జీవితంలో కీలకమని,ఏ ఉద్యోగంలో గాని లేదా ఇష్టమైన రంగంలోగాని స్థిరపడాలంటే డిగ్రీ తప్పనిసరి అని అయితే డిగ్రీతోనే కాకుండా పి.జి లో కూడా మంచి కోర్సులుంటాయని ఆ కోర్సులు కూడా పూర్తి చేసుకుంటే ఇంకా మంచి ఉజ్వల భవిషత్తు ఉంటుందని, మహిళలు అన్నిరంగాల్లో రాణించిననాడే స్త్రీ సాధికారత సాధ్యమని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ గురుకుల సంస్థలో మనం చదువుకున్నందుకు మనం ఈ సంస్థకు ఏదైనా మంచి చేయాలని గుర్తు చేశారు.తృతీయ సంవత్సర విద్యార్ధినులు వారి తీపి జ్ఞాపకాలను ఈ సందర్బంగా పంచుకున్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.


