రాయికల్ కేజీబీవీ విద్యార్థిని నందినికి రూ.25 వేల పురస్కారం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా రాయికల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థిని ఎన్. నందిని ఇంటర్మీడియట్–2026 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సి.ఇ.సి గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నందినిని ఘనంగా సన్మానించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నందిని 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు ప్రజా సంబంధాలు, విద్య కె. కేశవరావు, విద్యాశాఖ సంచాలకులు డా. యోగితా రాణా, కాలేజీయేట్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి ఎ. దేవసేనలు ఆమెను అభినందించి రూ.25 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఈ. నవీన్ నికోలస్, సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి జి. శిరీష తదితరులు పాల్గొన్నారు. నందిని సాధించిన విజయం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

