బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ప్రకటనలో తెలిపారు.ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తేమ పేరిట కోతలు, గన్నీ సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని విమర్శించారు.మొక్కజొన్నకు కేంద్రం రూ.2400 మద్దతు ధర ప్రకటించినా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తేమ నిబంధనలు సడలించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సురభి నవీన్ కుమార్ హెచ్చరించారు.

