పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నవగీతం తల్లాడ ప్రతినిధి:
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం, గాంధీనగర్ గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా పాడి గేదెలు (బర్రెలు) దొంగతనానికి గురవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయల విలువైన పాలిచ్చే గేదెలు మాయమవడంతో తాము జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఇటీవల సోములగడ్డ స్పీడ్ బ్రేకర్ వద్ద ఓ వ్యాన్ లో గేదెలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక గేదె కింద పడిపోయింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఆధారాల ప్రకారం మల్లారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే వ్యాన్ లో గేదెలను దొంగిలించి తరలిస్తున్నట్లు రైతులు గుర్తించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

