వర్షం వస్తే బురదమయంగా మారుతున్న వీధులు
నవగీతం, మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో మౌలిక వసతుల కొరత కారణంగా స్థానిక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా వీధులన్నీ బురదమయంగా మారి ప్రజలు రాకపోకలు సాగించడం కష్టసాధ్యంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. అలాగే అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాలు, వీధి లైట్ల సౌకర్యం కూడా తగినంతగా లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి (ఈఓ) వెంటనే స్పందించి 4వ వార్డులో విద్యుత్ స్థంబాలు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


